‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గానికి ప్రతినిధి ఉంటాడు. ఏదో ఒకరోజు రాజ్యాధికారం సాధిస్తాడు’ అనుకున్న కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరిరామజోగయ్య ఆశలు అడియాశలయ్యాయి. అసలు సేనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 25 స్థానాల లోపే ఇస్తాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడించింది. అందుకు తగినట్లుగానే కేవలం 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లను పవన్ మహాప్రసాదంలా తీసుకున్నారని కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నన్ను కాపులు ఓన్ చేసుకోవాలి. అండగా నిలవాలని పవన్ నిత్యం చెబుతుంటారు. అలాంటి ఆయన కాపు కుల పెద్దగా ఉన్న జోగయ్య మాట వినకుండా వెన్నుపోటు పొడిచారు. సేన 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలని, పవర్ షేరింగ్ అడగాలని ఆ పెద్దాయన కొంతకాలంగా సేనానికి లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్.. జోగయ్య మాటలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.
ఇటీవల హరిరామ మరో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్థికంగా బలంగా ఉన్న కాపు, తూర్పు కాపులకు 40 సీట్లు తీసుకోవాలి. మరో 23 ఇతర కులాల వారి కోసం అడగాలి. కాపుల నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇది చాలా ముఖ్యమన్నారు. జనసైనికులు కూడా ఇలాగే చేయాలని తమ అధినేతను కోరారు. కానీ జరిగింది వేరు. అంతకుముందు రాసిన లేఖలో ఎక్కడ ఎవరు పోటీ చేయాలో వివరించారు. దానిని కూడా పవన్ పట్టించుకోలేదు.
– జోగయ్య విజయనగరం సీటును గుర్రాల అయ్యలు (తూర్పు కాపు) లేదా పొలవలస యశ్వసిని (తూర్పు కాపు)కు ఇప్పించాలని అడిగారు. కానీ చంద్రబాబు అదితి గజపతిరాజుకు కేటాయించారు.
– ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన సీటును బూరగడ్డ వేదవ్యాస్ లేదా పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు చెప్పగా టీడీపీ కాగిత కృష్ణప్రసాద్కు ఇచ్చింది. నూజివీడు నుంచి బర్మా ఫణిబాబును బరిలో దించాలని చెబితే కొలుసు పార్థసారథికి కట్టబెట్టింది.
– ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి సీటు మువ్వల రవీంద్రకు ఇప్పించాలని చెబితే తెలుగుదేశం కావ్య కృష్ణారెడ్డికి అమ్మేసింది.
– రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు సీటును ఆదికేశవులు నాయుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇప్పించాలని కోరితే బాబు తన సామాజికవర్గానికి చెందిన గురజాల జగన్మోహన్నాయుడికి ఇచ్చేశారు. నంద్యాల నుంచి శెట్టి విజయకుమార్ను బరిలో ఉంచాలని కోరితే తెలుగుదేశం ఎన్ఎండీ ఫరూక్ను నిలబెట్టింది. తంబళ్లపల్లెను కొండా నరేంద్రకు ఇచ్చేలా చూడాలని పవన్కు చెబితే పట్టించుకోలేదు. నారా వారు ఈ సీటును జయప్రకాష్రెడ్డికి ఇచ్చారు.
పవన్ కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకున్నారు. ఇందులో ఐదు మాత్రమే ప్రకటించారు. మిగిలినవి ఎప్పుడు చెబుతారో తెలియని పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇంకా 57 చోట్ల అభ్యర్థులు ఎవరో చెప్పాలి. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. వారు అడిగే దానిని బట్టి మళ్లీ సర్దుబాటు జరగొచ్చు. ఇంకా తెలుగుదేశంలో అసంతృప్తులకు బుజ్జగించేందుకు బాబు సేనకు ఇచ్చిన 24 సీట్లలో కొన్ని తీసుకునే ప్రమాదం ఉంది. తెలుగు తమ్ముళ్లనే అందులోకి పంపి స్వయంగా పవన్ ద్వారా బీఫారం ఇప్పించవచ్చు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టీడీపీనే ఎక్కువ సీట్లు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పలుమార్లు నిర్ధారించింది.
జోగయ్య లేఖ ప్రకారం చంద్రబాబు 63 అసెంబ్లీ సీట్లను జనసేనకు ఇవ్వాలి. ప్యాకేజీ లేదా మరే విషయమో కానీ పవన్ రాజీపడిపోయి తక్కువ సీట్లకు ఓకే చెప్పేశారు. కాపులు బలం పుంజుకోవాలంటే ఎక్కువగా సీట్లు తీసుకోవాలని జోగయ్య చెప్పారు. కానీ ఆయన లేఖలకు సమాధానం లేకపోగా పొత్తులో జనసేన నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు కాపుల్లో వ్యతిరేకత వచ్చి ఎన్నికలపై ప్రభావం చూపే అధికంగా ఉంది. అయినా బాబు ప్రయోజనాలే సేనానికి ముఖ్యం.