జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం & దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. జగన్ పాలనలో జరిగిన సంక్షేమాభివృద్దిని అడిగి తాము ఓట్లు అడుగుతామని, ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ది చెబుతూ ప్రజలని ఓట్లు అడిగే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. అలాగే నిన్న జరిగిన జండా సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో జనసేన నాయకులు కార్యకర్తలు నీరుగారిపోయారని చెప్పుకొచ్చారు.
వైసీపీ నాయకత్వం మొదటి నుండి తాము 5ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమాభివృద్దిని ప్రజలకి చూపిస్తూ ఓట్లు అడుగుతామని చెప్పుకుంటూనే వస్తున్నా, ఇటు జనసేన కానీ , చంద్రబాబు కానీ 2014 నుండి 2019 వరకు పరోక్ష మద్దతుతో ఉమ్మడిగా నడిపిన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాన్ని అభివృద్దిపై పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న సంక్షేమాభివృద్దికి దీటుగా చెప్పుకునే విధంగా నాటి చంద్రబాబు పాలన లేదని చెప్పొచ్చు . చివరికి హామీలు ఇచ్చిన మ్యానిఫెస్టో పత్రాన్ని సైతం తమ వెబ్ సైట్ నుండి తొలగించి వేశారు. దీనిపై నాడు పవన్ సైతం ప్రశ్నించిన దాఖలాలు లేవు, ఈ నేపధ్యంలో కొట్టు సత్యనారాయణ గారు విసిరిన సవాల్ ని పవన్ స్వీకరించే సాహసం చేయగలడా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది.