తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తున్నది మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అందిస్తున్న మహాలక్ష్మి పథకం.
ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎంతమంది మహిళలకు ఉపయోగకరంగా ఉంటోంది, ఇది సబబేనా లేక వోటు బాంక్ కి విసిరిన వలా అన్న విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి.
ఈ మహా లక్ష్మి పథకం మీద మహిళలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తుండగా, ఆర్టీసీ మీద పడబోయే ఆర్థిక భారం గురించి పలువురు పెదవి విరుస్తున్నారు.
ఆర్టీసీ సేవలను ఉపయోగించే మహిళల్లో పొట్టకూటి కోసం వేరే వూర్లకు వెళ్ళి కూలి పనులు చేసేవారితో సహా విద్యార్థులు, ఉద్యోగినులు ఉన్నారు. దగ్గరలోని టౌనుకు పనుల మీద వెళ్ళే మహిళలు కొద్ది శాతం ఉన్నారు. వీరిలో ఎవరికి ఉచిత సేవలు అవసరం అవుతాయన్నది ప్రశ్నార్థకం.
హాస్టల్లో ఉన్న పిల్లలను చూడ్డానికి వెళ్ళాలనుకునే తల్లులు, బస్సు చార్జీలకు డబ్బు లేక వాయిదా వేసుకునే స్థితి చాలా చోట్ల ఉంది. అలాగే చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీతంలో అధిక భాగం బస్ పాస్ లకు పోస్తూ, అర కొర ఖర్చులతో ఇల్లు నడిపే స్త్రీలూ ఉన్నారు. మరో వైపు, ప్రైవేట్ కాలేజీలో చదివే స్తోమత లేక, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుతూ బస్ పాస్ ల కోసం ఖర్చు పెట్టవలసిన విద్యార్థినులూ ఉన్నారు. కొన్ని చోట్ల బస్సు చార్జీలు రోజూ పెట్టవలసి రావడం, అందుకు తగిన ఆర్థిక వనరులు లేని కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదువు మానిపిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి
ఇటువంటి బహుళ పరిస్థితులు ఉన్న చోట ఈ ఉచిత పథకాన్ని అందరికీ వర్తింపజేయాలా లేక, అవసరం ఉన్న వారికే వర్తింప జేయాలా అన్నది చర్చనీయాంశం.
ఈ పథకం అమల్లోకి రావడం వల్ల రెట్టించిన ఉత్సాహంతో మహిళలు దీన్ని వినియోగించుకునే క్రమంలో అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వస్తున్న తీర్థ యాత్రలు, బంధువుల సందర్శన,పిక్నిక్ లు ఇతర పెండింగ్ పనులన్నీ బస్సుల్లో తిరిగి చూసుకోవడం మొదలు పెట్టారు.
దీని వల్ల మరో గమనించవలసిన విషయం, గ్రామాల్లో పురుషులు ప్రయాణాలు తగ్గించుకుని అవసరమైనపుడల్లా “నీకు ఉచితమేగా, నువ్వు పోయి ఈ పని చేసుకురా” అని పంపడం మొదలు పెట్టారు
నిన్నటి లెక్కల ప్రకారం మహాలక్ష్మి స్కీమ్ ఎఫెక్ట్ తో మహిళా ప్రయాణీకుల సంఖ్య 40% పెరిగింది. ఎక్కడ చూసినా మహిళలతో కిట కిట లాడుతున్నాయి బస్సులు. రోజువారీ సగటు ప్రయాణీకుల సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెరిగింది. 90% ప్రయాణీకులు స్త్రీలే కావడంతో పురుషులకు బస్సులో చోటు లేకుండా పోయింది. అందువల్ల వారు ప్రత్యామ్నాయ వాహనాలు వెదుక్కుంటున్నారని వార్తలు. చివరికి ఒక యువకుడు విసిగి పోయి, పురుషులకు తగినన్ని సీట్లు ఆర్టీసీ బస్సుల్లో కేటాయించాలనీ, ఈ ఇబ్బందులు పడలేక పోతున్నామని నిన్న ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాడు.
ఆర్థిక కోణాన్ని విస్మరించి ఈ పథకాన్ని చూడలేం. మహాలక్ష్మి పథకం కింద, ఆర్టీసీ బస్ లో ప్రయాణించిన ప్రతి మహిళకూ జీరో టికెట్ జారీ చేస్తారు. ఆ టికెట్ల వల్ల ఎంత మంది మహళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారనే విషయం తెలుస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం ఆ టికెట్స్ డబ్బుని ఆర్టీసీ కి రీ ఇంబర్స్ చేస్తుంది.
ఈ పథకానికి అనుకూల వర్గాల నుంచి వస్తున్న లెక్కలేమిటంటే, అధిక సంఖ్యలో జీరో టికెట్స్ జారీ అవుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ ప్రభుత్వం నుంచి రీ ఇంబర్స్ మెంట్ వస్తుంది కాబట్టి ఆర్టీసీ త్వరలో లాభాల బాట పట్టబోతోందని.
మరి దీని వల్ల ప్రభుత్వం మీద పడుతున్న ఆర్థిక భారం సంగతేమిటి? అది స్థూలంగా ఎవరి నెత్తిన పడబోతోంది?
ప్రతి రోజూ జీరో టికెట్లు తెగుతున్నా,ఆర్టీసీ కి ధన రూపేణా ఆదాయం రాక పోవడంతో ఒక్క రోజులోనే 7 కోట్ల రూపాయల ఆదాయ నష్టం జరిగిందని ఆర్టిసీ తెలిపింది.
ఇదే పథకాన్ని కాంగ్రెస్ కర్ణాటక లో “శక్తి”పేరుతో ప్రవేశ పెట్టింది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ కి రీ ఇంబర్స్ మెంట్ చేయడం లో విఫలం కావడంతో ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ల మీద విపరీతమైన భారం పడింది. ఈ విషయాన్ని CAG ఫిబ్రవరి 2023 లో విడుదల చేసిన ఆడిట్ రిపోర్ట్ లో పేర్కొంది. దీని వల్ల కర్ణాటక లోని నాలుగు జోన్ల ఆర్టీసీ కార్పొరేషన్లు కలిపి వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని రిపోర్ట్ లో కాగ్ చెప్పింది. కర్ణాటక లో పరిస్థితి ఇలా ఉంటే, లక్షల కోట్ల అప్పులు నెత్తిన ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా భారం కాదా?
పథకం మొదలైన కొత్తల్లో ఈ మాత్రం ఉత్సాహం సహజమేననీ, కొద్ది రోజుల తర్వాత కేవలం అవసరం ఉన్న వారు మాత్రమే బస్సెక్కుతారనీ, త్వరలోనే ఈ రద్దీ తగ్గి పోతుందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు
కొత్తగా బయట పడ్దిన విషయమేమిటంటే, ఆర్టీసీ లో ఇప్పటికే అనేక కాలం చెల్లిన బస్సులున్నాయి. వీటిలో రోజువారీ ప్రయాణీకుల కంటే అధికంగా ప్రయాణీకులు ఎక్కడంతో వాటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే భయాలు చోటు తలెత్తుతున్నాయి. అందువల్ల రద్దీని తట్టుకునేందుకు రెండు వేల వరకూ కొత్త బస్సులు కావలసి వస్తాయని అంచనా
ఏ పథకమైనా అర్హులకు అందాలి. దాని ఫలాలు వారు అనుభవించాలి.
మంచి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగినులు, టికెట్ కొని బస్ లో ప్రయాణించగలిగే గృహిణులు ఇతర స్త్రీలకు ఈ పథకం వర్తింపజేయడం అవసరం లేదని పలురువు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థినులు, తక్కువ జీతాలకు పని చేసే ప్రైవేట్ ఉద్యోగినులు, రోజు కూలీలు ఇటువంటి అర్హులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడదని, మరో వైపు రీ ఇంబర్స్ మెంట్ పరంగా ప్రభుత్వం మీద కూడా భారం పడదని సూచిస్తున్నారు.
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే కాలంలో ఆర్టీసీ కి ఇబ్బందులు తప్పవని ప్రజాభిప్రాయం.