ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం “ఓటు”. ప్రజలలో ఓటు హక్కు మీద చైతన్యం కలిగించేందుకై జనవరి 25 నా జాతీయ ఓటుహక్కు దినోత్సవంగా ప్రతిఏటా జరుపుకుంటున్నాం.
ఒకప్పుడు దొంగ ఓటు వేసి మన ఓటు హక్కుకి భంగం కలిగిస్తే అడిగినా పట్టించుకునే నాధుడు ఉండేవాడు కాదు. కానీ, ఇప్పటి టెక్నాలజీలను, కొత్త పోకడలను పుణికి పుచ్చుకుని భారతీయ ఓటు హక్కు తీరు గత కొన్నేళ్ళలో చాలా మారింది.
తద్వారా ఓటర్లు చైతన్యవంతమై ఎలా వినియోగించుకోవాలి అన్న విషయంలో పూర్తి విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టోలు గమనించడం, గత ప్రభుత్వం ఎన్ని మేనిఫెస్టో హామీలను అమలు పరిచిందో తరిచి చూడటం, తమ ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని సరిగా ప్రయోగించడం వంటివి చేస్తున్నారు.
ఓటు ఉందా లేదా అనేది ఎన్నికలకి ముందే ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం రావడం, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా ఓటు హక్కును మార్చుకోగల అవకాశాలు ఉండటం వంటివి ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఉపయోగపడే అంశాలుగా మారాయి. మీరు కూడా ఈ ఓటర్ల దినోత్సవం నాడు మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి.