ఆంధ్రప్రదేశ్ లో మరి కొన్ని నెలల్లో లోక్ సభ , రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో జరుగుతున్న నగదు బదిలీలపై దృష్టిపెట్టాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిబంధనలకు అనుగుణంగా జరగని లావాదేవీల పై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అన్ని బ్యాంకులను ఆదాయపు పన్ను శాఖ ఆదేశించినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఒక్కరోజులో రూ.10 లక్షలు అంతకుమించి నగదు ఉపసంహరించినా, డిపాజిట్ లేదా బదిలీ చేసినా ఆ వివరాలు ఐటీ అదనపు శాఖకు బ్యాంకులు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెల వ్యవధిలో రూ.50 లక్షలు, అంతకుమించి లావాదేవీలు నిర్వహించిన ఖాతాల వివరాలను కూడా ఇవ్వాలని, 2000కి మించి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపినా సమాచారం ఇవ్వాలని ఐటీ శాఖ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
2023 అక్టోబరు నుంచి ఎన్నికలు పూర్తయేవరకూ ఈ వివరాలు అందజేయాలని బ్యాంకులను ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఐటీ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు ఈ సమాచారం అందించనున్నాయి.