నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. గ్రూపు-2 నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులు, మొత్తం 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి.
కాగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. పరీక్ష సిలబస్ను ఏపీపీఎస్సీవెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు.