ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ఆస్తి పంపకాలు జరగలేదు. ఎట్టకేలకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తి చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమావేశంతో విభజన పూర్తి చేశామని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అశోక రోడ్లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 11.586 ఎకరాలను, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయించింది కేంద్ర హోంశాఖ. పంపకాల్లో భాగంగా ఏపీకి 58.32 శాతం దక్కగా, తెలంగాణకు 41.68 శాతం దక్కింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవన్ విలువ 9,913.505 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవన్ ను రెండు భాగాలుగా విభజించారు. విభజనలో భాగంగా ఏపీకి 11.536 ఎకరాలను అప్పగించారు. దీనిలో 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ భవన్, 4.315 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలోలో ఉన్న నర్సింగ్ హాస్టల్, 2.396 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడి హౌస్, 0.512 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నల్ రోడ్, 0.954 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శబరి బ్లాక్ లోని కొంత భాగాన్ని అప్పగించారు. ఏపికి కేటాయించిన స్థలం విలువ 5,781.416 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
విభజనలో భాగంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. దీనిలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ ను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల విలువ 4,132.089 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా.