సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో వెలిగొండ ప్రాజక్టు వద్దకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి బుధవారం స్వయంగా అక్కడికి వెళ్లి హెలిప్యాడ్, పైలాన్ల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ త్వరలోనే మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్కు నీరు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయానికే రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ పూర్తవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో పూల పుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఒకటి. మూడు జిల్లాల వాసుల కోరిక ఇది. 1996లో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు నాయుడు దీనికి హడావుడిగా శంకుస్థాపన చేశారు. 2004 వరకు ఆయన కేవలం రూ.10 లక్షలు మాత్రం ఖర్చు పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. అది కూడా శంకుస్థాపన కోసమే. ఏ బడ్జెట్లోనూ రూపాయి ఇవ్వలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక నల్లమల సాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమల సాగర్తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులు చేయించారు. ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదు. 2014లో అడ్డగోలు హామీలిచ్చి, బీజేపీ అండతో సీఎం అయిన బాబు వెలిగొండ పేరుతో దోపిడీకి తెరతీశారు. కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లను దోచిపెటి కమీషన్లు దండుకున్న చరిత్ర ఆయనది.
2019లో సీఎం అయిన జగన్ తన తండ్రి వైఎస్సార్ కల అయిన వెలిగొండపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.1,046 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మొదటి టన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. రెండో టన్నెల్ పనులు జనవరి నెల 23వ తేదీన పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ వెలిగొండ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పైలాన్లను ఆవిష్కరించనున్నారు. లక్షలాది మంది ప్రజలకు సాగు, తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది.