చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది . వివరాల్లోకి వెళితే 2019లో ప్రకాశం జిల్లా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే క్రమంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావటంతో వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.
కేసు పూర్వాపరాలను విచారించిన ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షను విధించడంతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ ఒంగోలు కోర్టు తీర్పు వెల్లడించడం గమనార్హం. కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు బండ్ల గణేష్ కు నెలరోజుల గడువు ఇవ్వడం విశేషం.
కాగా చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కోవడం బండ్ల గణేష్ కు ఇది మొదటిసారి కాదు. గతంలో టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్లో పరిచయం అయిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో ప్రొడ్యూసర్గా మారారు. అనంతరం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ చెప్పే మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అంటూ బండ్లగణేష్ ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.