ఏపీ డీఎస్సీని నాలుగు వారాలు పాటు వాయిదా వేస్తూ గౌరవ హైకోర్టు తీర్పుని వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ నాలుగు వారాలు పాటు ఆగిపోనుంది. ఈనెల 15 నుంచి ప్రారంభం కావలసిన డీఎస్సీ పరీక్షల ప్రక్రియ ఇప్పటిలో ఉండే అవకాశం లేదు. మరో రెండు వారాలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున, డీఎస్సీ ప్రక్రియ ఎన్నికల సరళి పూర్తైన పిమ్మట కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే నిర్వహించే అవకాశం ఉంది.
గత నెల 12వ తేదీన జగన్ ప్రభుత్వం 6100 ఉద్యోగాలతో డీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్లు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులున్నాయి. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో హైకోర్టు నాలుగు వారాలు పాటు డిఎస్సిని వాయిదా వేసింది. కాగా ఇప్పటికే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి రెండు పేపర్లు పరీక్ష పూర్తి అయ్యింది. మిగిలిన సబ్జెక్టులకి సంబంధించి ఐదో తారీకు టెట్ పరీక్ష జరగనుంది. డీఎస్సి పరీక్ష వాయిదా పడడంతో ఇప్పటికే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులలో ఆందోళన వ్యక్తమవుతోంది.