ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు ప్రశలు వేసి సమాధానాల కోసం నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని ఎంతలా వేధించిందో చెప్పారు. దుర్మార్గ పార్టీయే దివంగత సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిందని, ఈ విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు.
నాడు వైఎస్ అభిమానులు అందరూ కాంగ్రెస్ వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి జగన్ తో నిలబడ్డారని, కష్టాల్లో నష్టాల్లో జగన్ తో నడిచి జగన్ ని గెలిపించుకొన్నామని తెలిపారు. మరి ఇప్పుడు మీరొచ్చి కాంగ్రెస్ తో నడవమని ఎలా అడుగుతారని, మేము ఎందుకు చేరాలని ప్రశ్నించడంతో పాటు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు . సీఎం జగన్ పాలన ప్రతి పేదవాడు సుభిక్షంగా ఉన్నారని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అతను రచ్చబండ దృష్టికి తీసుకొచ్చాడు. ఇవన్నీ నిజాలే కదా అని కాంగ్రెస్ నాయకులు సైతం చర్చించుకోవడం విశేషం.