ఆయన రాజకీయాలలో తలపండిన యోధుడు.. ఆయనకో రాజకీయ శిష్యుడు.. కొంతకాలానికి నాయకుడికి తన శిష్యుడిపై కోపం వచ్చింది. దాంతో ఒక నియోజకవర్గం భవితవ్యం మారిపోయింది. ఆ గురు శిష్యులు కొత్త రఘురామయ్య, గద్దె వెంకట రత్తయ్య. ఆ నియోజకవర్గం పేరు తాడికొండ.
కొత్త రఘు రామయ్య 1952 నుండి 1979 వరకు వరుసగా ఆరు సార్లు లోక్ సభ సభ్యుడిగా పనిచేసారు. ఆయన తన రాజకీయ జీవితంలో జవహర్ లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో 1957లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా చేరి 1964 వరకు రక్షణ, కార్మిక, పౌర సరఫరాలు మంత్రిగా పనిచేసారు. లాల్ బహుదుర్ శాస్త్రి మంత్రివర్గంలో (1964-66) వరకు పౌర సరఫరాలు, సాంకేతిక శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో(1966- 77) వరకు న్యాయ, పెట్రోలియం, పార్లమెంటరి వ్యవహారాలు, నౌకా రవాణా,పర్యాటక శాఖామాత్యులుగా సుదీర్ఘ కాలం పనిచేసారు.
1967లో జరిగిన ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గద్దె వెంకట రత్తయ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1972 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనే మరోసారి విజయం సాధించారు. 1972 వరకూ కొత్త రఘు రామయ్యకు అనుచరుడిగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న గద్దె వెంకట రత్తయ్య రాజకీయ జీవితాన్ని ఆంధ్ర ఉద్యమం మలుపు తిప్పింది. 1972లో ప్రారంభమైన ఆంధ్ర ఉద్యమంలో గద్దె వెంకట రత్తయ్య చురుగ్గా పాల్గొన్నారు. కాగా ఈ సమయంలో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కొత్త రఘు రామయ్యను, గద్దె వెంకట రత్తయ్య వర్గం తీవ్రస్థాయిలో దూషించారని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఇరువురు నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గద్దె వెంకటరత్తయ్యకు బుద్ది చెప్పాలని కొత్త రఘురామయ్య నిర్ణయించుకున్నారు.
ఇదే సమయంలో ఎస్సీ నియోజకవర్గ ఎంపిక కోసం డీ లిమిటేషన్ కమిటీ మూడు నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుంది. ఆ మూడు నియోజకవర్గాలు వేమూరు, పొన్నూరు, తాడికొండ.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎస్సీ జనాభా ఇంచుమించుగా ఒకేలా ఉండడంతో ఈ మూడు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలపాలన్న లక్ష్యంతో కొందరు వేమూరు, పొన్నూరు నియోజకవర్గాలను ఎస్సీ నియోజకవర్గంగా మార్చాలని ప్రతిపాదించారు. కానీ తగిన సమయం కోసం ఎదురుచూస్తున్న కొత్త రఘు రామయ్య తాడికొండను ఎస్సీ నియోజకవర్గంగా మార్చాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఆయనలా పట్టుబట్టడంతో ఉన్న ఆంతర్యం తాడికొండ ఎస్సీ నియోజకవర్గంగా మారితే గద్దె వెంకట రత్తయ్యకు అక్కడి నుండి తిరిగి పోటీ చేసే అవకాశం ఉండదు. అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రఘురామయ్య పంతానికి డీ లిమిటేషన్ కమిటీ కూడా తలొగ్గి తాడికొండను 1975లో ఎస్సీ నియోజకవర్గంగా ఖరారు చేశారు.
దీంతో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం గద్దె వెంకట రత్తయ్య కోల్పోయారు. 1978 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అమృతరావు తాడికొండ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. కానీ గద్దె వెంకట రత్తయ్య మాత్రం మంగళగిరి నియోజకవర్గం నుండి జనతా పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించడం విశేషం. కొత్త రఘు రామయ్య పంతం వల్ల తాడికొండలో పోటీ చేసే అవకాశం కోల్పోయినా గద్దె వెంకట రత్తయ్య మంగళగిరి నుండి గెలిచి తాను ఎక్కడ నుండి పోటీ చేసినా గెలవగలను అని నిరూపించుకున్నారు. కాగా కొత్త రఘురామయ్య 1979 జూన్ 6 న మరణించారు.