వైద్యశాఖలో 53 వేల పోస్టుల భర్తీ
తెలుగుదేశం ప్రభుత్వం వైద్యశాఖలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తద్వారా పేదలకు సరైన వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రులు అధ్వానంగా ఉండేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారాయి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రికార్డు స్థాయిలో ఎంతో పారదర్శకంగా 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు.
గత చంద్రబాబు హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్, ఇతర వైద్య కోర్సులు చేసిన వారికి అవకాశాలు లభించలేదు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధించినా పట్టించుకోలేదు. టీడీపీ ఉన్నప్పుడు పోస్టులు భర్తీ చేయాలంటే ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలు పంపి నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది.
జగన్ సీఎం అయ్యాక సర్కారు హాస్పిటల్స్పై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో పేదలకు వైద్యసేవలు అందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. నాడు నేడు కింద పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. వసతులు కల్పించారు. అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. వివిధ విభాగాల్లో 53,126 పోస్టుల భర్తీకి వేగంగా జరిగింది. వైద్యశాఖ కోసమే ప్రత్యేకంగా నియామక బోర్డు పెట్టారు. జీరో వేకన్సీ పాలసీని రూపొందించారంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
నాడు – నేడు
చంద్రబాబు హయాంలో స్పెషలిస్ట్ వైద్యుని పోస్టులు 1,050, మెడికల్ ఆఫీసర్లు 1,581, స్టాఫ్ నర్సులు 1,672, ల్యాబ్ టెక్నీషియన్లు 122, ఫార్మసిస్ట్ పోస్టులు 44 మాత్రమే భర్తీ చేశారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విషయానికొస్తే స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు 4,324, మెడికల్ ఆఫీసర్లు 2,475, స్టాఫ్ నర్సులు 6,734, ఏఎన్ఎంలు 13,540, మల్టీలెవల్ హెల్త్ ప్రొవైడర్లు 10,032, పారామెడికల్ సిబ్బంది 9,751, క్లాస్ 4 పోస్టులు 3,303, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 249, కొత్త వైద్య కాలేజీల్లో సిబ్బంది పోస్టులు 1,582, ఇతర పోస్టులు 1,136ను భర్తీ చేశారు. ప్రజారోగ్యం విషయంలో డాక్టర్లు, సిబ్బంది చాలా కీలకం. అందుకే జగన్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తూ వచ్చారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పైరవీలు, లంచాలకు తావులేకుండా ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్కే దక్కుతుంది.
డాక్టర్లు, సిబ్బంది పెరగడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు పెరిగాయి. ఆపరేషన్లు చేయించుకుంటున్న వారి సంఖ్య అధికమైంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులంటే భయడేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ధైర్యంగా వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఉచితంగా మందులు తీసుకుంటున్నారు. జగన్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే అది అబద్ధం. ఒక్క వైద్యశాఖలోనే 53 వేల పోస్టులు భర్తీ చేసింది జగన్ ప్రభుత్వం