రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ఫిబ్రవరి 14, 2024 అనగా రేపు నెల్లూరు నగరంలో టీడ్కో గృహాల పంపిణీ జరగబోతుంది. నెల్లూరు నగరపరిధిలో అనేక ప్రాంతాల్లో నిర్మించి ఉన్న 15 వేల టిడ్కో గృహాలను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గల అల్లీపురం ఏపీ టిడ్కో ప్లాట్ల సముదాయం వేదికగా వర్చువల్ గా ఆయన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నగరపాలక సంస్థ పరిధిలోని అల్లీపురం, వెంకటేశ్వరపురం (ఫేస్-3), కొండ్లపూడి, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, ఇరుకళల పరమేశ్వరి కాలనీల యందు, రూరల్, సిటీ నియోజకవర్గ పరిధిలోమొత్తం 22 వేల టిడ్కో గృహాలను ప్రభుత్వం నిర్మించింది. అందులో గతంలోనే 7 వేల గృహాలను లబ్దిదారులకు అందజేశారు. ఇప్పుడు తాజాగా రేపు 15 వేల గృహాలను పేదలకు అందజేయబోతున్నారు. ఇంకా 5 వేల గృహాలు అందజేయాల్సిన జాబితాలో ఉన్నట్లు అధికారిక సమాచారం. అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.