ఓ సినిమాలో నటుడు అలీ తనది కండలు తిరిగిన బాడీగా బిల్డప్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. బెలూన్లకు గాలి కొట్టి శరీరానికి చుట్టుకుని.. దుస్తులు వేసుకుంటాడు. చూసే వారికి అబ్బా.. ఎంత బలవంతుడో అనిపిస్తుంది. కానీ పిన్నీసుతో గుచ్చగానే అందరి ముందు గాలి పోతుంది. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా అంతే. అధికారంలోకి వచ్చేది నేనేనంటూ సభల్లో చెబుతుంటారు. తీరా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీల వారి కోసం గాలం వేస్తున్నారు. ఎవరైనా చిక్కితే టికెట్లు ఇచ్చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఎంపీ టికెట్ ఓకే చేసినట్లు సమాచారం. ఇక ఆయన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి నెల్లూరు రూరల్లో అవకాశం ఇచ్చారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎక్కడో ఒక టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్నాడని కావ్య కృష్ణారెడ్డిని తరిమిస్తే చంద్రబాబు వద్ద చేరారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి కావలి నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి పోటీ అవకాశముంది. ఇక నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుని లాగేసుకుని అదే సీటు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ను అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేయిస్తున్నట్లు ప్రకటించారు. నూజివీడును కొలుసు పార్థసారథి, గన్నవరంను యార్లగడ్డ వెంకట్రావుకు కట్టబెట్టారు. వీరిలో జగన్ టికెట్లు నిరాకరించిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఈ చెల్లని కాసులే బాబుకు దిక్కయ్యారు.
సర్వేల పేరుతో సీనియర్ తెలుగు తమ్ముళ్లకు టికెట్లు ఎగ్గొట్టడం.. అద్దె నేతలకు అవకాశం ఇవ్వడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2019లో ఓడిపోయాక బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కష్టపడి పనిచేసిన నాయకులకు అధినేత వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలం లేదు కాబట్టే.. జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఇప్పటికే జనం భావిస్తున్నారు. ఇప్పటికి బిల్డప్ బాబాయ్ అవతారం ఎత్తినా త్వరలోనే మామూలు మనిషి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు.