రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభం కానున్న 2024 ఐపీఎల్ సీజన్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనం చేయనున్నట్లు స్పష్టత వచ్చింది. ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో రిషభ్ పంత్ పునరాగమనంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కాగా రిషభ్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా ఉంది. రిషభ్ పంత్కు తిరిగి స్వాగతం. నిన్ను చూసేందుకు ఇక వేచి ఉండలేం అంటూ ట్వీట్ చేసి రిషభ్ అభిమానుల్లో జోష్ నింపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ తో రిషభ్ పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉన్నాడని అభిమానులకు క్లారిటీ వచ్చింది. ఈ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును నడిపించడమే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా రిషభ్ చేపట్టనున్నాడు. కాగా డిసెంబర్ 30, 2022నజరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ 14 నెలల తరువాత పూర్తి స్థాయిలో కోలుకుని ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధం అయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ కి రిషభ్ పంత్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ని నియమించింది. కాగా జట్టుగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రిషభ్ తిరిగి రానున్న నేపథ్యంలో 2024 ఐపీఎల్ ఎడిషన్ లో అయినా ఢిల్లీ క్యాపిటల్స్ రాత మారుతుందేమో చూడాలి మరి.