జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులపై దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియాకు పరిపాటిగా మారిపోయింది. తాజాగా కృష్ణా జలాలను కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు తీసుకువచ్చిన జగన్ సర్కారుపై అసత్య ప్రచారానికి దిగడాన్ని ఎల్లో మీడియా పరాకాష్టగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. తద్వారా కుప్పం నియోజకవర్గంలోని చెరువులను నింపి కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు.
కానీ రాజకీయ దురుద్దేశ్యంతో ఓ వర్గం మీడియా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు ఆగిపోయాయంటూ అసత్య ప్రచారానికి దిగింది. కానీ వాస్తవానికి కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ కి.మీ.68.466 వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ నుండి కృష్ణా జలాలను విడుదల చేసి శాంతిపురం మండలం వెంకటేశ్వరపురం గ్రామం వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ కి.మీ. 75.750 వద్ద ఉన్నచిట్టివాని కుంటను నింపారు. అనంతరం స్థానిక నేతల కోరిక మేరకు కుప్పం బ్రాంచ్ కాలువ కి.మీ.84.00 వరకు నీటిని విడుదల చేసి గుండిశెట్టిపల్లి వద్ద స్థానికులు పూజలు నిర్వహించిన తర్వాత పూర్తి నీటిని కి.మీ.70.100 వద్ద ఉన్న మద్దికుంట మరియు దాని దిగువ ప్రాంతంలో ఉన్న నాగసముద్రం, మణేంద్రం చెరువులు వైపు కృష్ణా జలాలను మళ్లించారు.
ఇప్పటికే వెంకటేశ్వరపురం వద్ద ఉన్న చిట్టివాని కుంట చెరువుతో పాటు మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువు కూడా దాదాపు నిండింది. కృష్ణా జలాలతో నిండిన చెరువులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు. కానీ ఓ వర్గం మీడియా మాత్రం వాస్తవాలకు పాతరేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రచారానికి దిగారు. రైతులకు, ప్రజలకు మేలు చేసేందుకు కృష్ణా జలాలను కుప్పంకు తీసుకువచ్చిన ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం ప్రజలంతా ఖండించాల్సిన విషయం. ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూరేలా ప్రజలను మభ్యపెట్టే వార్తలను ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజులు రానున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు..