దేశంలో బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ ఘటనకు కారణమైన నిందితుడి ఫోటోను ఎన్ఐఏ అధికారులు విడుదల చేసారు. నిందితుడి ఆచూకీ తెలియజేసినవారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఈ కింది పేర్కొన్న ఫోన్ నంబర్కు 080-29510900, 8904241100 లేదా అడ్రస్కు Postal Address : SP, National Investigation Agency, #3rd Floor, BSNL Telephone Exchange, 80ft Road, HAL 2nd Stage, Indiranagar, Bengaluru, Karnataka-08. Mail : info.blr.nia@gov.in సమాచారం అందించాలని సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
మార్చి 1న రామేశ్వరం కేఫ్లో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. మాస్క్, టోపీ, గ్లాసెస్ పెట్టుకున్న నిందితుడు పూర్తిగా ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్నాడు. నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని తేలింది. కాగా నిందితుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించి రూ.10 లక్షల నజరానా పొందవచ్చని ఎన్ఐఏ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.