ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వర్చువల్ గా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఈ కేసులో పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నామని కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
మరోవైపు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదిస్తూ, వచ్చే నెల 16 వరకు కవిత చిన్నకుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో పాటు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. కాగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనుంది.
కోర్టు తీర్పు సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని అన్నారు. తనను జైల్లో పెట్టవచ్చేమో కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ కేసులో మొదటి నిందితుడు బీజేపీలో చేరారని,రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని పేర్కొన్నారు.