ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి నెగ్గడంలా కాకుండా తగ్గడంలానే కనిపిస్తుంది. గతంలో టీడీపీలో పొత్తుకు ముందు మూడో వంతు సీట్లలో పోటీ చేస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కనీసం 60 సీట్లకు తగ్గకుండా టీడీపీతో పొత్తులో ఉంటారని కాపు వర్గంతో పాటు జనసైనికులు ఆశించారు. ఇదే విషయంపై హరిరామజోగయ్య బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. కానీ జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లుతూ పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లకు పొత్తుకు ఒప్పుకోవడం జనసైనికులకు మింగుడుపడడం లేదు.
టీడీపీతో కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే సమయంలో కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆశావహుల్లో ఆశలు రేపి కనీసం అభ్యర్థులను ప్రకటించడం పక్కనబెడితే పోటీ చేసే స్థానాలను కూడా ప్రకటించకుండా పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నాడు. దీంతో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా లేట్ చేస్తే ప్రజలకి చేరువ కావడం ఎలా అని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
మరోవైపు పవన్ కి వచ్చే సీట్లలో కోత పడనుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీతో పొత్తు నేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులు పునరావాస కేంద్రంగా జనసేన మారనుందని టీడీపీ నాయకులే జనసేన తరపున సీట్లలో పోటీ చేయనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా జనసేన సీట్లను 24 నుండి 16 కు కుదించే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని పలువురు జనసేన నాయకులు సన్నిహితుల దగ్గర వాఖ్యానించడం గమనార్హం. పవన్ చెప్తున్న మాటలకూ చేస్తున్న చేతలకు పొంతన ఉండటం లేదని కనీసం అభ్యర్థులను, పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇవ్వాలని పలువురు జనసేన ముఖ్యనేతలు సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ జనసేన ఆశావహులకు న్యాయం చేస్తారా? కొద్దిసేపట్లో తేలనుంది