ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే సంచలన అరెస్టులు జరిగాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ల అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు నోటీసులు పంపినా కేజ్రీవాల్ స్పందించకపోవడంతో గురువారం అర్థరాత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టులోనే బెయిల్ కి అప్లై చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.
కాగా ఈ స్కామ్ లో కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారని ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు సౌత్ గ్రూప్ సంస్థ నుంచి కేజ్రీవాల్ రూ.కోట్ల ముడుపులు అందుకున్నారని విచారణ నిమిత్తం 10 రోజుల రిమాండ్ కావాలని ఈడీ వాదించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో ప్రయోజనాలను పొందేందుకు కవితతో పాటు మరికొందరు ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని విచారణలో వెల్లడైందని ఈడీ వెల్లడించింది.
అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత సాక్షిగా మారే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ కవిత కనుక సాక్షిగా మారితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 15 మంది కూడా సాక్ష్యం చెప్పే అవకాశం ఉందని సమాచారం. కవిత సాక్షిగా మారితే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ను కట్టడి చేయాలని భావిస్తున్న బీజేపీకి పెద్ద ఆయుధం దొరికినట్లే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి కవిత సాక్షిగా మారుతుందో లేదో కొద్దిరోజుల్లో తెలియనుంది.