ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి విదితమే. ఆయన అక్కడినుండే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించిన విధంగానే ఢిల్లీలో తలెత్తబోయే నీటి సమస్య గురించి ఈడీ కస్టడీ నుండి తొలి ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన మరో ఉత్తర్వు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఈడీ కస్టడీలో ఉన్నా కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారంటూ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనుండి ఇచ్చిన రెండో ఉత్తర్వు ఇదే కావడం గమనార్హం.
కాగా ఈడీ కస్టడీ నుండి ఉత్తర్వులు ఇవ్వడానికి కంప్యూటర్ పేపర్ తాము సమకూర్చలేదని ఈడీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు వీటిని ఎవరు అందించారో విచారణ చేస్తున్నామని వెల్లడించింది. కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్ మంత్రి ఆతిశీని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో మరో ఉత్తర్వు బయటకు రావడంతో ఈడీ ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి. ప్రజల గురించి ఆలోచిస్తూ కేజ్రీవాల్ జైలు నుండి పాలన సాగిస్తున్నారని ఆప్ నేతలు వెల్లడిస్తున్న తరుణంలో గ్యాంగులు మైంటైన్ చేసేవాళ్ళే జైలు నుండి ఆదేశాలు ఇస్తారని బీజేపీ కౌంటర్ వేయడం విశేషం.