మధ్యప్రదేశ్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో నేటి ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది పూజారులకు గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారిలో ప్రధాన అర్చకుడు సంజయ్ గౌర్ సహా పలువురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఓ వస్త్రం అంటుకొని పూజారులు, భక్తులపై పడటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురై లోపలి నుంచివారంతా ఒక్కసారిగా పరుగెత్తుకుని బయటకు రావడంతో అక్కడంతా రసాభాసగా మారింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది గాయపడగా క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్ తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా ఈ ఘటన నుండి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె త్రుటిలో బయటపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతుండటం గమనార్హం.