‘ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. యువతకు ఉద్యోగాల్లేవు’ అంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వారి గ్యాంగ్, ఎల్లో మీడియా రోజూ ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే పెయిడ్ పేజీల్లో వీరి తప్పుడు ప్రచారానికి అడ్డే లేదు. చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పరిశ్రమలు, ఉద్యోగాల విషయంలో ప్రజల్ని ఏనాడూ మోసం చేయలేదు. ఎంతో నిజాయతీగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 127 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో 85,000 మందికి పైగా ఉపాధి పొందారు. కానీ పచ్చ గ్యాంగ్ దీనిని దాచేసి నోటికొచ్చింది ప్రచారం చేస్తాయి.
సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంతో యకహోమా టైర్ల పరిశ్రమ రెండో దశ విస్తరణకు సిద్ధమైంది. జపాన్కు చెందిన యకహోమా గ్రూప్.. అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) పేరుతో టైర్ల తయారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పెట్టారు. సీఎం జగన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 2020లో వారి ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. వెంటనే అనకాపల్లి పరిధిలో ఏపీఐఐసీ భూమి కేటాయింపు జరిగింది. తొలిదశలో రూ.1,750 కోట్లతో హాఫ్ హైవే టైర్లు (భారీ యంత్రాలకు ఉపయోగించేవి) ఉత్పత్తి చేసేందుకు యూనిట్ పనులు మొదలయ్యాయి. అయితే 2021లో కోవిడ్ మహమ్మారి వచ్చినా ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందించింది. దీంతో యూనిట్ సిద్ధమైంది. 2022 ఆగస్ట్ 16వ తేదీన జగన్ ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వాడుతూ ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. పరోక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తోంది.
విస్తరణ వైపుగా..
సీఎం ప్రోత్సాహం బాగుండటంతో పరిశ్రమ విస్తరణకు నిర్వాహకులు పూనుకున్నారు. ప్యాసింజర్ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్ను రూ.680 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. కార్లకు డిమాండ్ పెరగడంతో ప్రతి సంవత్సరం 17 లక్షల టైర్ల తయారీ లక్ష్యంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికానికి యూనిట్ అందుబాటులోకి వస్తుంది. పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలైతే మరో 2,300 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తున్నారు.
ఇదంతా చంద్రబాబు అండ్ కోకు కనిపించదు. జగన్పై బురద వేస్తే చాలు.. అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కావడం, ఉపాధి లభించడంతో లాభపడిన జనం తమను ఛీ కొడుతున్నారనే విషయాన్ని ఎల్లో గ్యాంగ్ గ్రహించలేకపోతోంది. జగన్ ఎప్పుడూ పరిశ్రమలు పెట్టేందుకు ఆ దేశం నుంచి వస్తున్నారు.. ఈ దేశం నుంచి వస్తున్నారని డబ్బా కొట్టలేదు. అందుకే ఆయనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది.